CM Revanth Reddy: పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్కు ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 21 వేల ఇళ్లు అదనంగా ఇస్తున్నామని.. గూడేల్లో ఆదివాసీలకు వంద శాతం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్.. కోఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి సంబంధించి పైలాన్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రెబ్బెన మండలంలో కాగజ్నగర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. మహిళల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల గురించి ప్రస్తావించారు. అర్హులైన అందరూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. నెల రోజుల్లోనే ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇళ్లను ఇచ్చినట్లు సీఎం తెలిపారు. త్వరలో రాష్ట్రం మొత్తంలో ప్రారంభించే ఇళ్లకు ఆదివాసీ ప్రాంతం నుంచే లక్ష ఇళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఇకపై ఏ కార్యక్రమమైనా ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తానని.. ఆదిలాబాద్ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
పర్యటనలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధి కోసం రూ. 112.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

