Telangana Public School: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్(TPS)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అత్యాధునిక డిజిటల్ క్లాస్రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. ఆ తర్వాత స్కూల్ క్యాంటీన్లో మహిళలతో కలిసి పూరీలు చేశారు. అనంతంరం విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్ఫాస్ట్ చేశారు.
పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల పోటీ: కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్న ఆరుట్ల టీపీఎస్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు భారీగా పోటీ పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీలో 150 మంది, ప్రైమరీలో 600 మంది, హైస్కూల్లో 800 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 160 మంది, ద్వితీయ సంవత్సరంలో 104 మంది ఉన్నారు. డిమాండ్ విపరీతంగా పెరగడంతో ప్రస్తుతానికి స్కూల్ వద్ద నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
Also read-Arutla: తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
కార్పొరేట్ స్థాయి సదుపాయాలు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఈ రోల్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అద్భుతమైన వసతులు కల్పిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల కోసం 5 ప్రత్యేక స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా అందిస్తారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ అత్యధునిక మైదానాలతో పాటు ప్రత్యేక కోచ్లను నియమించారు.

