CM Revanth Reddy: ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఈసారి ఉదయం పూటే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఉదయం 10 గంటల లోపు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కేవలం గంటన్నర వ్యవధిలోనే పూర్తి: జూన్ 2వ తేదీ ఉదయం 8:30 గంటలకు జాతీయ పతాకావిష్కరణతో ఆవిర్భావ వేడుకలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. కేవలం గంటన్నర వ్యవధిలోనే కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వేడుకలకు హాజరయ్యే అతిథులు, ప్రజలు, విద్యార్థులు ఎండ వల్ల ఇబ్బంది పడకుండా సభాప్రాంగణంలో తగిన నీడ, తాగునీరు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహిస్తూనే.. ఎండల కారణంగా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

