Monsoon: రాబోయే వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాల రాక, వర్షపాత అంచనాలు, విపత్తు నిర్వహణపై సీఎం అధికారులతో విస్తృతంగా చర్చిస్తున్నారు.
రైతులను అప్రమత్తం చేయండి: వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ శాఖకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు ముందస్తుగా పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి. పంట మార్పిడి, పంటల వైవిధ్యత (Crop Diversification) యొక్క ప్రాధాన్యతను అన్నదాతలకు వివరించాలని తెలిపారు. “వర్షాలు, వరదల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణమే స్పందించాలి. నిర్లక్ష్యాన్ని అస్సలు సహించేది లేదు.” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి: రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం ఆరా తీశారు. జలాశయాల గేట్లు, ఇతర నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గతంలో దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. నిధుల కొరత లేకుండా విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ. 1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం తక్షణమే వినియోగంలోకి తేవాలని సూచించారు.
Also read-Minister Tummala: తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా మక్కలు కొనడం లేదు.. మంత్రి తుమ్మల స్పష్టం
వర్షపాతంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్: కీలక సమావేశానికి వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా (HYDRAA), విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో వాతావరణ శాఖ అధికారులు ‘ఎల్ నినో’ ప్రభావం, ఈ ఏడాది కురిసే వర్షపాతంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరాలను అందించారు.

