CM Revanth Reddy Elevated Corridors: హైదరాబాద్లో మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మూసీ ప్రాజెక్టుతో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను తాము తీసుకురాలేదని.. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన దాన్నే తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. గతంలో లాగా నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా అనే విధానం ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పాటు నగరం నలుమూలలకి ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో సోమవారం జరిగిన చర్చలో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు నగరం నడిబొడ్డున మూసీ నది వెంట సుమారు 40 కిలోమీటర్ల మేర భారీ ఎలివేటెడ్ కారిడార్ను ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని చెప్పారు. నగరం నడిబొడ్డు నుంచి అన్ని ప్రాంతాలకు వేగంగా చేరుకోవడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ కారిడార్లు కీలకం కానున్నాయని సీఎం పేర్కొన్నారు.
మూసీ ప్రాజెక్టు వల్ల ఎవరూ నిరాశ్రయులు కారని, బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సరైన పునరావాసం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గంగా, సబర్మతి నదుల తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) తరహాలో BOT (Build-Operate-Transfer) పద్ధతిలో ఈ ఈస్ట్-వెస్ట్ కారిడార్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, రీజనల్ రింగ్ రోడ్ (RRR) వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజలు రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, మూసీ ప్రక్షాళన భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్నామని స్పష్టం చేశారు.
కాగా, ఇందిరమ్మ కుటుంబ బీమాను బడ్జెట్లో పొందుపరిచామని సీఎం రేవంత్ అన్నారు. ఆరోగ్య బీమా కింద రూ. 10 లక్షలు, చనిపోతే రూ. 5 లక్షలు సాయం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉన్నాయన్నారు. వారందరికీ జీవిత బీమా అమలు చేస్తున్నామని వెల్లడించారు. పెన్షనర్లు.. ఉద్యోగులు అందరికీ రూ. కోటి 25 లక్షల ప్రమాద బీమా తెచ్చామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదని సీఎం రేవంత్ తెలిపారు.

