Sunday, February 8, 2026
HomeTop StoriesMunicipal elections: మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యత.. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన

Municipal elections: మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యత.. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన

Congress announces in-charges for municipal elections: తెలంగాణలో త్వరలోనే జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారవ్వగా.. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మిగతా పార్టీలతో పోలిస్తే అధికార కాంగ్రెస్‌ ఒక అడుగు ముందే ఉంది. నిన్న (ఆదివారం) మేడారం వేదికగా జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో పాలనా యంత్రాంగం ఒక్కసారిగా అలెర్ట్‌ అయ్యింది. మరో మూడు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

- Advertisement -

మున్సిపల్ సమరానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో సూత్రపాయంగానిర్ణయించింది. కేవలం ఎన్నికల నిర్వహణే కాకుండా, జిల్లాల పునర్విభజన వంటి కీలక పాలనాపరమైన అంశాలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల ప్రకటన పూర్తయ్యింది. పట్టణ ఓటర్లను ఆకర్షించడం ద్వారా తమ బలాన్ని నిరూపించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. అయితే, దీనిలో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీకి పట్టు చిక్కేలా సీఎం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే సీనియర్ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ఇన్-ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. వీరు అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఏకం చేయడం వరకు అన్ని బాధ్యతలను పర్యవేక్షిస్తారు. నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్‌బాబు, ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంకు కొండా సురేఖ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ నియామకాల ద్వారా స్థానిక నాయకత్వంలో ఉన్న అసంతృప్తిని తొలగించి.. ఐక్యంగా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు..

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుండటంతో టికెట్ల కోసం ఆశావహులు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు మొదలుపెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ల పోటీ అధికంగా ఉంది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు, ఇప్పుడు అధికారంలో ఉండటంతో మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అటు ప్రతిపక్షాలు కూడా పట్టణ ప్రాంతాల్లో తమ పట్టు కోల్పోకుండా గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నాయి. మరోవైపు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కొత్త పథకాలకు అవకాశం ఉండదు కాబట్టి.. సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News