Minister Vakiti Srihari: తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన సవాలును, తనపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో తనను చంపేందుకు కొందరు ప్రయత్నించారని మంత్రి వెల్లడించారు. అయితే తాను అటువంటి బెదిరింపులకు, చావుకు భయపడే వ్యక్తిని కాదని, ప్రజల అండదండలు ఉన్నంత వరకు ఎవరికీ లొంగబోనని ఆయన స్పష్టం చేశారు.
జల్సాలు చేయడం గొప్ప కాదు: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో రూ. 3.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాంతీయ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు వ్యక్తులు పని చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. టెండర్లు పూర్తయిన పనులను కూడా అడ్డుకుంటూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. గొప్పగా బతకడం అంటే జల్సాలు చేయడం కాదని మంత్రి అన్నారు. మన ప్రాంత భవిష్యత్తు కోసం, ప్రజల కోసం కృషి చేయని జీవితం వృథా అని ఆయన పేర్కొన్నారు.
Also read-Hyderabad: కోర్ అర్బన్ కోసం కొత్త చట్టం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
విమర్శలపై ధీటుగా: తనపై వస్తున్న తీవ్ర విమర్శలను మంత్రి వాకిటి శ్రీహరి కొట్టిపారేశారు. అభివృద్ధి పనులు ఆగిపోకూడదన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గబోనని మంత్రి వాకిటి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సంక్షేమంతో పాటుగా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు.

