CP Sajjanar on Lawyer Khawaja Mohijuddin murder: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసును పోలీసులు అతి కొద్ది సమయంలోనే ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనర్ వెల్లడించారు. తొలుత ప్రమాదంలా కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా కుట్ర ఉందని.. దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 23న ఉదయం మొహిజుద్దీన్ స్విమ్మింగ్కు వెళ్తుండగా నంబర్ ప్లేట్ లేని స్కార్పియో వాహనంతో నిందితులు ఢీకొట్టి హత్య చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాం. ప్రత్యేక బృందాలతో గాలించి వారిని అదుపులోకి తీసుకున్నాం.
ప్రాణం తీసిన వక్ఫ్ ఆస్తులు, ట్రిబ్యునల్ కేసులు..
అయితే, వక్ఫ్ బోర్డు ఆస్తులు, ట్రిబ్యునల్ కేసులకు సంబంధించి మొహిజుద్దీన్ హైకోర్టులో వాదిస్తున్నారు. ఈ కారణంగానే హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ హత్య వెనుక ఉన్న ప్రధాన నిందితుడు ముజాహిద్ ఆలంఖాన్ను ఇప్పటికే అరెస్ట్ చేశాం. మొహిజుద్దీన్ హత్య కోసం రూ. 15 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిందితున్ని హరియాణాలోని పానిపట్లో కిషన్ అలియాస్ పప్పును అరెస్ట్ చేశాం. నిందితులు జనవరి నుంచి న్యాయవాది కదలికలపై రెక్కీ నిర్వహించారు. హత్య కోసం ప్రత్యేకంగా స్కార్పియో వాహనం కొనుగోలు చేశారు. డ్రైవర్ అభిజిత్ అలియాస్ నాని.. వేగంగా మొహిజుద్దీన్పైకి వాహనం నడిపి హత్య చేసినట్లు గుర్తించాం. నిందితుల నుంచి రూ.10.10 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశాం. నిందితుల్లో మరికొంతమంది పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.’’ అని సజ్జనర్ వెల్లడించారు.

