D. Raja at CPI Centenary celebrations: భారత్ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా డి. రాజా బహిరంగ సభలో మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/kesslapur-nagoba-jatara-in-keslapur/
దేశాభివృద్ధిలో కమ్యూనిస్టుల త్యాగాలు మరువలేనివని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించిన ఆయన.. లౌకికత్వాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఖమ్మం నగరంలోని ఎస్.ఆర్ & బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. డి. రాజాతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సీపీఐ ప్రస్థానం ఎన్నో త్యాగాలతో మొదలైందని డి. రాజా అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్, సీపీఐ కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదని.. అప్పటి బ్రిటిష్ పాలకులతో ఆర్ఎస్ఎస్ చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. పాలస్తీనాలో మారణహోమం జరుగుతోందని.. వేలమంది అమాయకులను ఊచకోత కోస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో హిట్లర్గా మారారని.. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పాలస్తీనాలో దారుణాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ సైతం అమెరికా ముందు తలవంచారని.. దేశ అభివృద్ధి కోసం మోదీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-participated-in-cpi-centenary-celebrations/
ఈ వేడుకలకు చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా, నేపాల్, వెనెజువెలా వంటి దాదాపు 40 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. సభకు ముందు ఖమ్మం పురవీధుల్లో వేలాది మంది కార్యకర్తలతో ‘జన సేవా దళ్‘ భారీ కవాతు, ఎర్రజెండాల ప్రదర్శన నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరం ఎర్రజెండాలతో అరుణమయంగా మారింది.

