OCTOPUS DGP CV ANAND Review: ఆక్టోపస్ పని తీరును డీజీపీ సీవీ ఆనంద్ సమీక్షించారు. కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్, యాంటీ టెర్రర్ ఆపరేషన్స్, ఆధునిక ఆయుధాల వినియోగంతో పాటు ఉగ్రవాద ఘటనలను ఎదుర్కొనే సన్నద్ధతపై డీజీపీ ఆరా తీశారు. కమాండోలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-direction-to-officers/
నక్సలైట్ల ఏరివేత విభాగం గ్రేహౌండ్స్తో పాటు తీవ్రవాద నిరోధక ప్రత్యేక దళం- ఆక్టోపస్(OCTOPUS) పనితీరు, కార్యాచరణ పటిమపై డీజీపీ సీవీ ఆనంద్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కమాండో శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన డీజీపీ.. క్యాంపస్లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, శిక్షణ విభాగం, ఆపరేషన్ సౌకర్యాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మారుతున్న శాంతిభద్రతల సవాళ్లకు అనుగుణంగా దళాల సంసిద్ధతను అంచనా వేశారు.
ఉగ్రవాద నిర్మూలన, అత్యవసర బందీల విముక్తి వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ దళాలు నిరంతరం అత్యంత అప్రమత్తతతో ఉండాలని డీజీపీ సూచించారు. కాలానుగుణంగా మారుతున్న అంతర్జాతీయ ఉగ్రవాద వ్యూహాలను తట్టుకునేలా ప్రస్తుతం ఇస్తున్న శిక్షణా విధానాలు, కోర్సుల ప్రమాణాలను మరింత ఆధునీకరించాలని పేర్కొన్నారు. కమాండోల నైపుణ్యాలను అత్యున్నత స్థాయిలో ఉంచడానికి రెగ్యులర్ ఫైరింగ్ ప్రాక్టీస్, కఠినమైన శారీరక, మానసిక శిక్షణ తప్పనిసరి అని డీజీపీ స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/major-fire-in-hayat-nagar-furniture-shop/
వ్యూహాత్మక ఆపరేషన్లలో అత్యాధునిక ఆయుధాలు, అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించడంపై దృష్టి పెట్టాలని డీజీపీ సూచించారు. ఈ మేరకు దళానికి సంబంధించిన సిబ్బంది కొరత, పోస్టుల భర్తీ, ఇతర మౌలిక వసతుల ప్రతిపాదనలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి త్వరలోనే అవసరమైన ఉత్తర్వులు వచ్చేలా చూస్తామని సీవీ ఆనంద్ హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఆక్టోపస్ & గ్రేహౌండ్స్ డీజీ అనిల్ కుమార్తో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

