Dharmapuri Arvind fires at Revanth Reddy: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ మంటలు రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ చేసిన విమర్శలపై ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టడం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అర్వింద్ మాట్లాడుతూ.. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామన్న సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. వరి కోతలు ప్రారంభం కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. “దొంగ ఇసుక రవాణాకు మీకు లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయి కానీ, రైతుల ధాన్యం తరలించడానికి మాత్రం లారీలు దొరకవా?” అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పడిందని గుర్తుచేశారు.
Also read: KTR letter: సింగరేణిలో రూ.16 వేల కోట్ల బొగ్గు స్కామ్.. సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందా..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపైనా అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న సమస్యలను గాలికొదిలేసి, కొత్త నగరాన్ని నిర్మిస్తామని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రియల్ దందాకు తెరలేపేందుకే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం ఇప్పటివరకు తెలంగాణ ప్రయోజనాలపై కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించలేదని, కేవలం విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.

