Microfinance Case: మైక్రో ఫైనాన్స్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు బ్యాంక్ ఖాతా నుండి శివ చౌహాన్ అకౌంట్కు మూడు విడతలుగా నగదు బదిలీ అయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ లావాదేవీల నేపథ్యంలో రమావత్ మధుకు చెందిన బ్యాంక్ ఖాతాలను పోలీసులు జప్తు చేశారు.
అసలేంటి ఈ వివాదం?: మైక్రో ఫైనాన్స్ పథకాల పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి.. మంగ్లీ మరియు ఆమె సోదరుడు తమను కోట్లాది రూపాయలు మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఇటీవల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల తరపున ఈ విషయంపై వివరణ కోరడానికి తాను మంగ్లీని సంప్రదించగా.. ఆమె తనను బెదిరించిందని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
మంగ్లీ కౌంటర్ ఫిర్యాదు: ఈ ఆరోపణలను గాయని మంగ్లీ తీవ్రంగా ఖండించారు. న్యాయవాది సుబ్బారావు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీల ద్వారా మనీ ట్రయల్ను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. కోట్ల రూపాయల మోసం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.

