DK Aruna satires on CM Revanth: తెలంగాణకు తానే 2034 వరకు సీఎంగా ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ పాలన విడిచి పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఎన్ని నెరవేర్చాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని, ప్రజలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం మీద రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు వంటి ప్రతి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు. రేవంత్ అసమర్థ పాలన, ప్రజా సమస్యలను పట్టించుకోని తీరు చూసి ప్రజలు నిజంగానే విసిగిపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల అసలు తీర్పు వచ్చే రోజులు ముందున్నాయని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు.
Also Read: Silver imports Ban: వ్యాపారులకు బిగ్షాక్.. వెండి దిగుమతులపై బ్యాన్ విధించిన కేంద్రం
ముందు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి..
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, వరుసగా మూడు సార్లు దేశ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికే భారీ మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని గుర్తు చేశారు. అసలు 2034 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంటుందా? లేక పూర్తిగా పతనమవుతుందా? అన్నదే ప్రశ్నగా మారిందన్నారు. అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడంపై ప్రజలు నవ్వుతున్నారని తెలిపారు. సీఎం ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఆ తర్వాతే భవిష్యత్ రాజకీయాల గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

