EV Charging Points in Telangana Apartments: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పాలసీని రూపొందిస్తోంది. ఈ పాలసీ ప్రకారం అపార్ట్మెంట్ల బేస్మెంట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో కొత్తగా నిర్మించే అపార్ట్మెంట్లు, నివాస సముదాయాల బేస్మెంట్లలో ఈవీ చార్జింగ్ సౌకర్యాలు కల్పించేలా ఇంధన శాఖ కొత్త విధానాన్ని ఖరారు చేస్తోందని ప్రభుత్వం పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు తమ ఇళ్ల వద్దే సౌకర్యవంతంగా వాహనాలను ఛార్జ్ చేసుకునే సదుపాయం కల్పించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రూపొందిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి, పారదర్శకతను పెంచడానికి ‘రియల్ టైమ్ డ్యాష్బోర్డ్’ను అభివృద్ధి చేయాలని ఈ మేరకు అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను పెంచడానికి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: https://teluguprabha.net/lifestyle/geriatric-parkour-singapores-latest-fitness-trend-goes-viral/
కాగా, ప్రస్తుతం ఇప్పటికే కొన్ని ప్రధాన అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు స్వచ్ఛందంగా ఈ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కొత్త పాలసీ అమలులోకి వస్తే ఇది నిబంధనగా మారే అవకాశం ఉంది. ఇంధన వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా వాతావరణం కాలుష్యం భారీగా తగ్గి నగరాలు పొల్యూషన్ ఫ్రీగా మారనున్నాయి.

