Kavitha vs KTR: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అహంకార ధోరణే ఓటమికి కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ ఆరోపించగా.. ఆయన వ్యాఖ్యలను కవిత ఖండించారు. ఓటమికి ఎవరికి కారణమో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని కవిత సవాల్ విసిరారు. వాస్తవాలు ఒప్పుకోవాలంటూ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/telangana/delhi-excise-policy-case-relief-for-kejriwal-sisodia-kavitha/
ఢిల్లీ మద్యం కుంభకోణం కోసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పలు కామెంట్లు చేశారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, తెలంగాణలో ఆ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు కవితకు అనుకూలంగా వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షోభకు గురి చేశారు..
‘నన్ను ఐదున్నర నెలలు జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారు. నాకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరూ తెలియదు. సంజయ్ సింగ్ ఎంపీ కాబట్టి పరిచయం ఉండేది. ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్లారు..? కోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టింది అని ప్రజలకు తెలిసింది.’ -కవిత
వ్యక్తిత్వ హననం
ఢిల్లీ మద్యం కేసులో తన తప్పు లేకుండానే వ్యక్తిత్వ హననం చేశారని కవిత ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అహంకార ధోరణే ఆ పార్టీ ఓటమికి కారణమని స్పష్టం చేశారు. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, దోపిడీదారులకు టిక్కెట్లు ఇవ్వడం ఓటమికి కారణమని వెల్లడించారు. తన సోదరుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టును చూశానని, తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమా సమాధానం చెప్పాలని కేటీఆర్ను నిలదీశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/vijay-and-rashmika-invites-pm-narendra-modi-for-reception/
‘ఈరోజు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడటం సరికాదు. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది సరైనపద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. నా తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఈ కుట్ర చేశారు. కోర్టు తీర్పుతో “కడిగిన ముత్యంలా” బయటకు వచ్చాను. న్యాయవ్యవస్థపై నాకున్న నమ్మకం నిజమైంది.’ అని కవిత వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేసును నేడు కొట్టివేసిన విషయం తెలిసిందే.

