Female constable died in Warangal: హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల వేధింపులు, అవమానం తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత ఎఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు దూరపు బంధువైన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్తో పరిచయం ఏర్పడింది. గతకొంత కాలంగా వీరిమధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరూ బంధువులు కావడంతో పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. మరోవైపు, అనిత తన క్లాస్మేట్ జబ్బార్లాల్తోనూ చనువుగా ఉండటం, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం రాజేందర్ తెలుసుకున్నాడు. దీంతో గత కొంత కాలంగా ఆమెను అతడు అనితను వేధింపులకు గురి చేస్తున్నాడు. మరొకరితో ఎందుకు మాట్లాడుతున్నావని తరచూ వేధించడంతో భరించలేక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో, తల్లిదండ్రులు రాజేందర్ కుటుంబ సభ్యులకు పెళ్లి చేయమని తెగేసి చెప్పారు.
పెళ్లి చేసుకోవాలంటే డబ్బులివ్వాలని డిమాండ్..
దీంతో, రాజేందర్ ఆమెపై పగ పెంచుకున్నాడు. కోపంతో జబ్బార్కు ఫోన్ చేసి అనిత గురించి చెడుగా ప్రచారం చేశాడు. అది నిజమేనని నమ్మిన జబ్బార్ కూడా అనితను వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాక పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక వేధనకు గురైన అనిత ఈ నెల 27న రాజేందర్కు ఫోన్ చేసి ‘నువ్వు, జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. మీవల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని బాధపడింది. దానికి రాజేందర్ నిర్లక్ష్యంగా చావమని సమాధానం చెప్పడంతో మరింత వేధనకు గురైన అనిత గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు రాజేందర్, అతడి కుటుంబ సభ్యులు, జబ్బార్పై గురువారం కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్ట్ చేశారు.

