- నాగోల్ లక్కీ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
- రెస్టారెంట్ లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన
- పరిశుభ్రత లోపాలపై నోటీసుకు సిఫార్సు..
సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): నాగోల్లోని లక్కీ రెస్టారెంట్ లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆహార భద్ర త,పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆహార భద్రత అధికారులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత, సిబ్బంది శిక్షణ, వంట శాల నిర్వహణలో పలు లోపాలు బయటపడటంతో రెస్టారెంట్కు నోటీసు (ఇంప్రూవ్మెంట్ నోటీస్) జారీ చేయాలని సిఫార్సు చేశారు.
సాస్, ఐస్క్రీమ్లో ఈగలు
తనిఖీల్లో రెస్టారెంట్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ప్రతిని వినియోగదారులకు కనిపించే ప్రదేశంలో ప్రదర్శించలేదని అధికారులు గుర్తించారు. సాస్, ఐస్క్రీమ్లో ఈగలు కనిపించడంతో వాటిని వెంటనే పారవేయించారు. ఫ్రీజర్ లో నిల్వ ఉంచిన ఉడికించిన చికె న్పై లేబుళ్లు లేకపోవడంతో ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఫ్రీజర్లో శాఖాహార, మాంసాహార ఆహార పదార్థాలను ఒకే చోట నిల్వ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు.
సాలీడు గూళ్లు..
ఫుడ్ హ్యాండ్లర్లకు తప్పనిసరి అయిన ఫుడ్ సేఫ్టీ ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడం గుర్తించారు. ప్యాక్ చేసిన ఉస్మానియా బిస్కెట్లు తదితర ఆహార ఉత్పత్తులపై తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్ వంటి తప్పనిసరి వివరాలు లేక పోవడం కూడా తనిఖీల్లో బయట పడింది. బిస్కెట్లు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగిస్తున్న ర్యాక్లు తుప్పు పట్టి అపరిశుభ్రంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. సమోసాలు వంటి ఆహార పదార్థాలను వార్తాపత్రికలతో కప్పి ఉంచడం, స్టోర్రూమ్ అపరిశుభ్రంగా ఉండటం, ఆహార పదార్థాలను నేలపై చెల్లాచెదురుగా నిల్వ చేయడం, పైకప్పుకు సాలీడు గూళ్లు ఉండటం వంటి పలు లోపాలు నమోదయ్యాయి.
Also Read: Hyderabad: ‘బతుకు జట్కా బండి’ కోసం వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం
అదనంగా వంట పాత్రలను వేడి నీటితో శుభ్రం చేయకపోవడం, కూరగాయలు, మాంసం కోసేందుకు ఉపయోగించే చాపింగ్ బోర్డు అపరిశుభ్రంగా ఉండటం కూడా గుర్తించారు. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో రెస్టారెంట్ యాజమాన్యానికి మెరుగుదల నోటీసు జారీ చేయాలని అధికారులు సిఫార్సు చేశారు. తనిఖీల అనంతరం రెస్టారెంట్కు 69 శాతం హైజీన్ రేటింగ్ కేటాయించినట్లు వెల్లడించారు. అధికారులు సూచించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.

