Harish Rao appeals to the AP government: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు.. అందుకు జగన్ మనకు లాంగ్ టైమ్ ఫ్రెండ్, ఆయనతో స్నేహంగా ఉండాలని అమిత్ షా ఆయనకు చెప్పినట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన విశ్లేషణలో భాగంగా వివరించారు. అయితే, ఈ వైరల్గా మారగా.. జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి తొత్తుగా మారి అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో జనసైనికులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వివాదం పెద్దగా అవుతుండటంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నాకు తప్పుడు సమాచారం అందిందని, తన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ, ఆయనపై పెట్టిన కేసులను కొట్టేయకుండా ఏపీ పోలీసులు ఇంకా కొనసాగిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: KTR election sketch: డిసెంబర్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు.. సిద్ధమవ్వాలని కేడర్కి కేటీఆర్ పిలుపు..!
కక్షపూరిత వైఖరి సరికాదు..
కాగా, ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎక్స్ వేదికగా ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యను తప్పుబడుతూ ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా విత్డ్రా చేసుకున్నప్పటికీ ఇంకా కక్షపూరిత ధోరణితో ఆయనపై కేసులు అలాగే ఉంచి వేధించడం ఏమాత్రం సరికాదని హరీశ్ రావు తన ట్వీట్లో స్పష్టం చేశారు. వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, ప్రొఫెసర్ నాగేశ్వర్పై పెట్టిన అన్ని కేసులను ఏపీ ప్రభుత్వం తక్షణమే కొట్టేయాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం, జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది చూడాలి మరి.

