Harish Rao fires on Revanth Reddy: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ “నత్తనడకన” సాగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. నల్గొండి జిల్లా గుర్రంపోడు మండలం జూనూతల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన.. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/minister-nara-lokesh-announced-project-punarviak/
ధాన్యం సేకరణ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు, పచ్చ గింజ పేరుతో మిల్లర్లు క్వింటాల్కు 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. ఇలా తరుగు తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి కనీస వసతులు లేవని.. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
70 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్కసారి కొనుగోలు కేంద్రాలకు రావాలి. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ భారీ పోరాటానికి సిద్ధమవుతుంది. పంట బీమా లేదు, సన్నాలకు బోనస్ రావడం లేదు. రైతు భరోసా కూడా అందరికీ అందలేదు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. -హరీష్ రావు
వరితో పాటు మొక్కజొన్న, జొన్న, శనగ వంటి పంటల కొనుగోళ్లు కూడా ఆగిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు తప్ప, కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

