Harish Rao lashes out at CM Revanth: కాంగ్రెస్ ప్రభుత్వంతో దళిత, గిరిజన సోదరులకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఒక్క ఎస్టీకి కూడా చోటు దక్కకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిధుల విషయంలో కేసీఆర్ ఆనాడు చట్టం చేశారు. మా హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి లోన్లు ఇచ్చాం. దళిత బందు ద్వారా రూ. 10 లక్షల పూర్తి సబ్సిడీతో రుణాలిచ్చాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. ఇక, కేసీఆర్ ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా.. తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించారు. పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటు రైతుబంధు ఇచ్చి ఎస్టీలను అక్కున చేర్చుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం తెలంగాణ కోసం రాజీనామా చేశాం. రేవంత్రెడ్డి కూడా రాజీనామా చేసి స్పీకర్కు ఉత్తుత్తి జిరాక్స్ పేపర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెక్కుపెట్టారుజ తెలంగాణ కోసం ఏనాడు పోరాడని వ్యక్తి ఇవాళ సీఎం అవ్వడం మన దౌర్భాగ్యం.’’ అని హరీశ్రావు ఎద్దేవా చేశారు.
Also read: Telegram App: కోర్టుమెట్లెక్కిన టెలిగ్రామ్ యాప్.. బ్యాన్ విధించడంపై హైకోర్టులో పిటిషన్

