High Court serious on HYDRA Commissioner Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్పై నమోదైన కోర్టు దిక్కరణ కేసులపై హైకోర్టు ఇటీవల సీరియస్గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఇదే విషయంపై హైకోర్టు ఇవాళ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. రంగనాథ్ను హైడ్రా కమిషర్ నుంచి తప్పించి.. వేరే విభాగానికి బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్ కంపెనీ కేసు విషయంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. లోతుకుంట భూముల వ్యవహారంలో ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తప్పించాలని సీఎస్ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా?
హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది సుస్పష్టమని హైకోర్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని.. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్కు సూచించింది. టాటా మోహన్రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ సందర్భంగా ఉదహరించింది. చట్ట పరంగానే పాలన కొనసాగాలని.. అంతేతప్ప వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని అభిప్రాయపడింది.

