Summer Temperatures: తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా ఇంటాబయటా వేసవి తాపంతో జనజీవనం ఉక్కిరిబిక్కరవుతోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వచ్చే వారం రోజుల పాటు ఎండలు మరింత తీవ్రం కానున్నాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Also Read: https://teluguprabha.net/telangana/kishan-reddy-comments-on-grain-procurement/
ఈ నెల 19 నుంచి 24 మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు సగటుగా 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఈ రోజు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక సోమవారం ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
Also Read: https://teluguprabha.net/technology-news/ai-threatens-entry-level-jobs/
ఇవి తప్పనిసరి
వేసవి తాపం దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తాగుతుండాలని చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులను ధరించాలని.. తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవాలని, గొడుగు తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. వేసవిలో సులభంగా జీర్ణమయ్యే తాజా ఆహారాన్ని తీసుకోవాలని.. నిల్వ ఉన్న, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

