CM Revanth- AIVA: వెలమ జాతిపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనగా ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (AIVA) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వెలమ జాతిపై సీం వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని సభ్యులు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలమ జాతిని లక్ష్యంగా చేసుకుని నిరంతరం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. దీనిని నిరసిస్తూ, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (AIVA) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఐవా కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల వెలమ సంఘాల ప్రతినిధులు వెలమ న్యాయవాదులతో అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇటీవల మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి వెలమ జాతిపై ఆక్రోశంతో, విచక్షణ రహితంగా మాట్లాడారంటూ సభ్యులు మండిపడ్డారు. ఆయన తీరును సంఘ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గతంలో కూడా పలుమార్లు వెలమ జాతిని అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని సభ అభిప్రాయపడింది.
ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెలమ సంఘాల ప్రతినిధులు, ప్రముఖ వెలమ న్యాయవాదులు, కుల పెద్దలు, వందలాది వెలమ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెలమ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు తక్షణమే స్పందించాలని, రేవంత్ రెడ్డి చేత వెలమ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారు తమ పదవులకు, జాతి ఆత్మగౌరవానికి ఏది ముఖ్యమో తేల్చుకోవాలని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గం గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్లాలని సంఘం సభ్యులు నిర్ణయించారు. రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి గ్రామ, మండల జిల్లా స్థాయిలో వెలమల ఆత్మగౌరవ నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.

