సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): ప్రపంచ తల్లిపాల వారోత్స వాల సందర్భంగా సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో గాంధీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుశీల హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొని తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా. కె. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం ఎంతో అవసరమని, పుట్టినప్పటి నుంచి తొలి ఆరు నెలల వరకు తల్లిపాలే శిశువుకు సంపూర్ణమైన, ఉత్తమమైన ఆహారమని తెలిపారు. తల్లి పాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయని పేర్కొన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి, శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గాంధీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుశీల హెల్త్ ఫౌండేషన్తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. ఎన్. వాణికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో గైనకాలజీ విభాగాధిపతి డా. శోభ, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డా. వాసుదేవ్, ఆర్ఎంఓ-1 డా. జయకృష్ణ, ఎల్ఆర్ఎంఓ డా. సుధార్ సింగ్, వైద్యులు, అధ్యాపకులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

