గండిపేట్ (తెలుగు ప్రభ): రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండ శ్రీరామ్నగర్ కాలనీలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కళాశాలలో ఎదురైన అవమానాలు, మానసిక వేధింపులే ఈ విషాదానికి కారణమయ్యాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ్నగర్కు చెందిన శ్రేయ బీటెక్ ఫస్టియర్ పరీక్షల సమయంలో పొరపాటున మొబైల్ ఫోన్ను పరీక్షా హాల్లోకి తీసుకెళ్లింది. కావాలని తీసుకురాలేదని ఎంత వివరణ ఇచ్చినా కళాశాల యాజమాన్యం పట్టించుకోకుండా పరీక్ష నుంచి డీబార్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఘటన అనంతరం సెకండియర్ తరగతులు ప్రారంభమైనప్పటి నుంచి కొందరు అధ్యాపకులు తరచూ ఆమెను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, గత మూడు నెలలుగా నిరంతరం మానసికంగా వేధింపులకు గురిచేశారని వారు ఆరోపించారు. ఈ పరిణామాలతో శ్రేయ తీవ్ర మనోవేదనకు లోనై, తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కళాశాలలో జరిగిన పరిణామాలు, వేధింపుల ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: National Award: తెలంగాణ యువ వైద్యురాలికి జాతీయ పురస్కారం

