బేగంపేట్ (తెలుగు ప్రభ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారి ఆలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి జరిగినట్లు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో అఖిల భారత చేనేత కళావైభవం ఆధ్వర్యంలో ఈ నెల 21న జరిగే అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా సమర్పించనున్న చీరను మగ్గంపై నేసే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి విస్తృత అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. 2014కు ముందు అమ్మవారి కల్యాణాన్ని ఆలయం లోపల నిర్వహించేవారని, అప్పట్లో 15 నుంచి 20 వేల మంది భక్తులు హాజరయ్యేవారని చెప్పారు. అనంతరం ఆలయం ముందు భారీ షెడ్ నిర్మించి కల్యాణోత్సవాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలి పారు. ప్రస్తుతం అమ్మవారి కల్యాణం, రథోత్సవాన్ని వీక్షించేందుకు 7 నుంచి 8 లక్షల మంది భక్తులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 21న జరిగే కల్యాణోత్సవం, 22న జరిగే రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై ఈ నెల 18న ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కొలన్ బాల్రెడ్డి, హన్మంతరావు, అశోక్ యాదవ్, అఖిల భారత చేనేత కళావైభవం సభ్యులు పాల్గొన్నారు.
Also Read: Golconda Jagadambika: గోల్కొండ జగదాంబికకు తొలి బోనం సమర్పణ.. పోటెత్తిన భక్తులు

