CM Revanth Reddy GHMC: పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల పనితీరు సరిగా లేకపోయినా, చేసే పనుల్లో జాప్యం జరిగినా ఉద్యోగాలు ఊడిపోతాయని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 3 కార్పొరేషన్లలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తామని.. రోడ్లు శుభ్రంగా లేకపోతే అధికారులను సస్పెండ్ చేస్తామన్నాని స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. సీఎస్, సీఎంఓ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్తో సమీక్షించారు. జీహెచ్ఎంసీ విభజనలో తలెత్తిన సమస్యల పరిష్కారాలను సూచించారు. నగరాభివృద్ధిలో సాంకేతికతను మరింతగా ఉపయోగించాలని.. ప్రధాన జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేయాలని సీఎం చెప్పారు. భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జ్ల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో నియంత్రణ అవసరమని.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి 10 శాతం అడ్వర్టైజింగ్ స్పేస్ కేటాయించాలన్నారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నుంచి ప్రతి ఏడాదికోసారి ఫీజు వసూలు చేయాలని.. అనధికార ప్రకటన బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివరించారు.
‘నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. నగరంలో వీధిదీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. లైటింగ్ వ్యవస్థకు యూనిఫాం కోడ్ అమలు చేసే విధంగా ఉండాలి. జీహెచ్ఎంసీ విభజనతో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. మూడు కార్పొరేషన్లలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని పార్కుల పూర్తి వివరాలు సేకరించాలి.’- సీఎం రేవంత్ రెడ్డి
త్వరలోనే ప్రతి జోన్ను స్వయంగా పర్యటిస్తానని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని.. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచే ఫీల్డ్లో ఉండాలని ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ప్రత్యేకంగా ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు.

