Ganja cultivation: రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరగడమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా ఇంటి గదుల్లోనే సాగు చేసే స్థాయికి చేరడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పెంచుతున్న ఇద్దరు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
ఇంట్లోనే హైటెక్ సాగు: దిల్లీకి చెందిన ధ్రువ్ ఠాకూర్, యూపీకి చెందిన అర్పిత్ స్టీఫెన్ ప్రకాశ్ నగరంలో నివసిస్తూ గంజాయికి బానిసయ్యారు. బయట కొనడం కంటే సొంతంగా పండించుకోవాలని ప్లాన్ చేసిన వీరు.. ఆన్లైన్ ద్వారా విత్తనాలను సేకరించారు. తాము ఉంటున్న అపార్ట్మెంట్లోని పూల కుండీల్లోనే గంజాయి మొక్కలను పెంచడం ప్రారంభించారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు.. వారి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనే వివరాలను పోలీసులు ఇంకా గోప్యంగానే ఉంచారు.
Also read-Hyderabad: ఆందోళనకర స్థాయిలో వాయు కాలుష్యం.. 318కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్!
భక్తి ముసుగులో గంజాయి సాగు: హైదరాబాద్ ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన మరో విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది. నారాయణఖేడ్ మండలం పంచగాం గ్రామంలో ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న అవుటి నాగయ్య అనే పూజారి.. ఆలయ ప్రాంగణాన్నే గంజాయి తోటగా మార్చేశాడు. భక్తి ముసుగులో గంజాయి సాగు చేస్తూ ఎక్సైజ్ అధికారులకు చిక్కాడు. ఇలా వరుసగా వెలుగుచూస్తున్న ఈ ఘటనలు సమాజంలో గంజాయి మహమ్మారి ఎంతలా వేళ్లూనుకుందో స్పష్టం చేస్తున్నాయి. నివాస ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వేదికలు కావడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

