Wednesday, February 11, 2026
Homeతెలంగాణహైదరాబాద్Water Management: వరద గండానికి 'జియో' కళ్లెం... ఓఆర్‌ఆర్ వరకు బృహత్తర ప్రణాళిక!

Water Management: వరద గండానికి ‘జియో’ కళ్లెం… ఓఆర్‌ఆర్ వరకు బృహత్తర ప్రణాళిక!

GHMC Water Management: వానొస్తే చాలు.. హైదరాబాద్ వాసుల గుండెల్లో వణుకు! రోడ్లు నదులను తలపించడం, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ ఏళ్లనాటి వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందా? కాగితాలకే పరిమితమైన పాత సర్వేలకు భిన్నంగా ప్రభుత్వం ఇప్పుడు తలపెట్టిన బృహత్తర ప్రణాళిక ఏంటి..? ‘జియో ట్యాగింగ్’ అనే ఆధునిక సాంకేతికతతో ఆక్రమణలకు నిజంగానే అడ్డుకట్ట పడుతుందా..? ఈ కొత్త మాస్టర్‌ప్లాన్‌తో భాగ్యనగర భవిష్యత్తు ఎలా మారబోతోంది..?

- Advertisement -

బృహత్తర ప్రణాళికకు ప్రభుత్వ పచ్చజెండా: హైదరాబాద్ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధికే కాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలి ప్రాంతం మొత్తాన్ని కలుపుకొని సమగ్ర వరద నీటి వ్యవస్థ (స్టార్మ్ వాటర్) మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలన్న జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనకు పురపాలక శాఖ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు వెంటనే కన్సల్టెన్సీని నియమించి, అధ్యయనానికి చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ కార్యదర్శి కె. ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్తులో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌ను వరద ముప్పు నుంచి కాపాడటానికి గొలుసుకట్టు చెరువులు, నాలాల అభివృద్ధి అత్యవసరమని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఓఆర్‌ఆర్ వరకు డిజిటల్ సర్వే.. జియో ట్యాగింగ్ : గతంలో జరిగిన సర్వేలు జీహెచ్‌ఎంసీ పరిధికే పరిమితమవగా, తాజా ప్రణాళిక శివారు ప్రాంతాలను కూడా కలుపుకొని ఓఆర్‌ఆర్ వరకు విస్తరించనుంది. ఇది ఈ ప్రణాళికలోని అత్యంత కీలకమైన అంశం.

ఆధునిక సర్వే: సర్వే ఆఫ్ ఇండియా, గూగుల్ మ్యాప్‌ల సాయంతో దశాబ్దాల నాటి పటాలను పరిశీలించి, కనుమరుగైన చెరువులు, నాలాలను గుర్తిస్తారు.
క్షేత్రస్థాయి పరిశీలన: గుర్తించిన నీటి వనరులను క్షేత్రస్థాయిలో సర్వే చేసి, వాటి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తారు.

ALSO READ:https://teluguprabha.net/telangana-district-news/hyderabad/hyderabad-bandlaguda-prostitution-racket-bangladesh-minor-girl-2025/


జియో ట్యాగింగ్: నాలాలు, చెరువుల హద్దులను అక్షాంశాలు, రేఖాంశాల (latitude, longitude) ఆధారంగా కచ్చితంగా గుర్తించి ‘జియో ట్యాగ్’ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఆక్రమణలు జరిగితే సులభంగా గుర్తించి, చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది జలవనరుల పరిరక్షణలో ఒక మైలురాయి కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చతుర్ముఖ లక్ష్యాలతో సమగ్ర ప్రణాళిక :ఈ బృహత్తర ప్రణాళిక కేవలం వరద నియంత్రణకే పరిమితం కాకుండా నాలుగు ప్రధాన లక్ష్యాలతో రూపుదిద్దుకోనుంది.

వరద నివారణ: ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడి నాలాల సామర్థ్యాన్ని పెంచి, జనావాసాలకు రక్షణ కల్పించడం.

ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/hyderabad-flood-solution-musi-rejuvenation-plan/

నీటి నాణ్యత పరిరక్షణ: వరద కాలువల్లోకి పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు కలవకుండా నిరోధించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం.

నిధుల సద్వినియోగం: ఇష్టానుసారం కాకుండా, మాస్టర్‌ప్లాన్ ప్రకారం అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటం.
సుస్థిర అభివృద్ధి: నీటి ప్రవాహాన్ని నియంత్రించే మొక్కలు నాటడం, ‘రెయిన్ గార్డెన్‌’లను అభివృద్ధి చేయడం, వరద నీటిని భూమిలోకి ఇంకించే ఏర్పాట్లు చేయడం వంటి పర్యావరణ హితమైన చర్యలు చేపట్టడం. హిమాయత్‌సాగర్, గండిపేట, హుస్సేన్‌సాగర్‌తో పాటు మూసీ నది పరీవాహక ప్రాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటిని అనుసంధానించడం ద్వారా హైదరాబాద్‌ను ‘వరద రహిత నగరం’గా మార్చడమే ఈ ప్రణాళిక అంతిమ లక్ష్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News