చార్మినార్ (తెలుగు ప్రభ): ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు మాల్యాల మధూసుదన్ యాదవ్ ఆధ్వర్యంలో చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంగళవారం బంగారు బోనం సమర్పించారు. బ్యాండు చప్పుల్లు, పోతరాజుల విన్యాసాల నడుమ, శివసత్తుల పూనకాలతో జోగిని అమ్మవారి రూపంలో బంగారు బోన మెత్తుకుని హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఉరేగింపుగా బయలుదేరారు. అంతకుముందు బంగారుమైసమ్మ దేవాలయ అమ్మవారికి భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఉరేగింపు కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిబౌలి నుంచి చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ బృందానికి ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి మాజీ చైర్మన్లు జనగామ మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Uppal bus stand: బురదలోనే ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్.. కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు


