సికింద్రాబాద్ (తెలుగుప్రభ): ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం మహేంద్ర హిల్స్లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూముల విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 844/1 మల్కాజిగిరి పరిధిలో ఉండగా, అక్కడ కంటోన్మెంట్లో 400 ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారో ప్రభుత్వం స్పష్టం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 74కు సంబంధించి కోర్టు వివాదాలు ఉన్నాయని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో కేసు ఓడిపోయిందని ఆయన పేర్కొ న్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపడతారో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రజలకు వివరించాలని కోరారు. రూ. 6 లక్షలకు 400 చదరపు అడుగుల ఇల్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా రూ. 10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకో వాలని, ఇల్లు మంజూరైన తర్వా త రూ. 6 లక్షలు చెల్లిం చాల్సిన పరిస్థితి ఉందని రామకృ ష్ణ ఆరోపించా రు. 400 చదరపు అడుగుల నిర్మాణం, బహుళ అంతస్తుల నిర్మాణ విధానంపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.పేదలు రూ. 6 లక్షలు చెల్లిస్తే వారికి లభించే ఇంటి పరిమాణం 400 చదరపు అడుగులేనని, పది అంతస్తుల నిర్మాణ విధానంలో నికరంగా లభించే స్థలం కేవలం 4–5 గజాల మేరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక్క గజానికి సుమారు రూ. 1.50 లక్షల వరకు పేదలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
Also Read: Congress : విద్యార్థులపై కాల్పుల వివాదం.. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్పై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తామంటే తామే గొప్ప అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాయని రామకృష్ణ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం టీమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని ఆయన తెలిపారు. తాను కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీమ్స్ ఆసుపత్రి మురుగు నీటి వ్యవస్థకు సంబంధించి కంటోన్మెంట్ ప్రాంతంలో సీవరేజ్ ఔట్లెట్ను అభివృద్ధి చేసి దానిని జీహెచ్ఎంసీ ఔట్లెట్కు అనుసంధానం చేయాలనే షరతుతో అనుమతులు ఇచ్చినట్లు రామకృష్ణ గుర్తు చేశారు. కంటోన్మెంట్ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి సీవరేజ్ ఔట్లెట్ పనులను పూర్తి చేయాలని కోరారు.
బోనాల నిధుల్లో కంటోన్మెంట్కు అన్యాయం..
బోనాల పండుగ సందర్భంగా కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆలయాలకు ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయిస్తూ వివక్ష చూపుతోందని రామకృష్ణ ఆరోపించారు. సికింద్రాబాద్, సనత్నగర్ నియోజకవర్గాల్లోని ఆలయాలకు ఒక విధంగా, కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆలయాలకు మరో విధంగా నిధులు కేటాయించడం సరికాదన్నారు. కంటోన్మెంట్లోని ఆలయాలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు మాత్రమే కేటాయిస్తుండగా, ఇతర ప్రాంతాల్లోని ఆలయాలకు కనీసం రూ.లక్ష వరకు ఇస్తున్నారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంపై వివక్ష ఎందుకు చూపుతున్నారో ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలని జె. రామకృష్ణ డిమాండ్ చేశారు.

