ఎల్బీనగర్ (తెలుగుప్రభ) : జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ మలుపు వద్ద రోడ్డు కుంగిపోతుందో, ఏ క్షణంలో మురుగునీరు ఉప్పొంగుతుందో తెలియక హయాత్నగర్ ప్రజలు నిత్యం భయాందోళనల మధ్య గడుపుతున్నారు. గురువారం నాడు కూడా సరిగ్గా ఇదే ఘోరం విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయాత్నగర్ ప్రధాన మార్గంలో డ్రైనేజీ ట్రంక్లైన్ ఒక్కసారిగా కుంగిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
హఠాత్తుగా కుంగిన రహదారి – గందరగోళంలో వాహనదారులు : ఎల్బీనగర్ జోన్.. హయత్నగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారిపై రాఘవేంద్ర హోటల్ సమీపంలో గురువారం నాడు డ్రైనేజీ ట్రంక్లైన్ మరోసారి తీవ్రంగా కుంగిపోయింది. రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడటంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిమిషాల ప్రయాణం గంటల శ్రమగా మారి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద తీవ్రతను గమనించిన మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి దుస్థితి పదే పదే పునరావృతమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2001 నాటి కాలం చెల్లిన పైప్లైన్ – నిత్య ప్రమాదాల నిలయం : ఈ సమస్యకు మూలాలు రెండు దశాబ్దాల క్రితం నాటివి. శారదానగర్ నుంచి కుంట్లూరు వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ డ్రైనేజీ ట్రంక్లైన్ను 2001వ సంవత్సరంలో నిర్మించారు. నాసిరకం పనులు, కాలం చెల్లిన సాంకేతికత కారణంగా ఈ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఏటా కనీసం 20 చోట్ల ఈ పైప్లైన్ కుంగిపోతూ రోడ్లపై మృత్యుకూపాలను సృష్టిస్తోంది. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది జనం నాణ్యత లోపించిన ఈ పనుల వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం : నూతన సాంకేతికతతో, పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త ట్రంక్లైన్ను నిర్మించాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నోమార్లు ప్రభుత్వానికి, సంబంధిత డ్రైనేజీ శాఖ అధికారులకు విన్నవించుకున్నారు. అయినప్పటికీ, ఎటువంటి ప్రయోజనం లేకపోవడం గమనార్హం. అలాగే జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులకు కూడా రహదారి నిర్వహణ, ప్రయాణికుల భద్రత పట్ల కనీస బాధ్యత లేదని సామ తిరుమల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకుంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శాశ్వత పరిష్కారం కోసం ‘యుద్ధప్రాతిపదికన’ చర్యలు అవసరం : ఇకనైనా తాత్కాలిక మరమ్మతులతో కంటితుడుపు చర్యలు ఆపి, ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైనేజీ శాఖ, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సరికొత్త ట్రంక్ పైప్లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యుద్ధప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసి, హయాత్నగర్ జాతీయ రహదారిని ప్రమాదాల బారి నుంచి కాపాడాలని సామ తిరుమల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

