చార్మినార్ (తెలుగు ప్రభ) : ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు మాల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి గురువారం బంగారు బోనం సమర్పించారు. బ్యాండు చప్పుళ్ళు …పోతరాజుల వీరంగాల నడుమ… శివసత్తుల నడుమ జోగిని దివ్య బంగారు బోన మెత్తుకుని హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఉరేగింపుగా బయలుదేరారు.
అంతకుముందు శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి భాగ్యనగర్ ఉమ్మడిదేవాలయాల ఉరేగింపు కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిబౌలి నుంచి లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు మాల్యాల మధుసూదన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి విష్ణుగౌడ్, లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ సమితి సభ్యులు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, సి.వెంకటేష్, బంగ్లా రాజుయదవ్, కె. రవిరాజ్, వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు అశోక్ రెడ్డి, హన్స్ రాజ్, తిరుపతి నర్సింగ్ రావు, ఆలయ కమిటీ ప్రతినిధులు చంద్రకుమార్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

