Homeతెలంగాణహైదరాబాద్Voter List : ఓటరు నమోదులో నిర్లక్ష్యం వీడండి : డీఈఓ ఆర్వీ కర్ణన్ పిలుపు!

Voter List : ఓటరు నమోదులో నిర్లక్ష్యం వీడండి : డీఈఓ ఆర్వీ కర్ణన్ పిలుపు!

హైదరాబాద్ సిటీబ్యూరో (తెలుగుప్రభ): భాగ్యనగర ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన మొదలైంది! మీ పేరు ఓటరు లిస్టులో భద్రంగా ఉందా లేదా అనే అనుమానం పీడిస్తోందా? ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ హైదరాబాద్ వ్యాప్తంగా వేగంగా సాగుతోంది. అయితే, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీ ఓటు గాల్లో దీపమే కానుంది. ఇప్పటివరకు నగరంలోని సుమారు సగం మంది ఓటర్ల ఆచూకీ కేవలం వివరాల నమోదు లోపంతో ప్రశ్నార్థకంగా మారడం కలకలం రేపుతోంది. ఇంతకీ హైదరాబాద్‌లో సగం ఓటర్ల చిరునామాలు దొరకకపోవడం వెనుకున్న అసలు కారణాలేంటి? ఎంఐఎం తన పట్టున్న నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియను ఎలా పరుగులు పెట్టిస్తోంది? ఎన్నికల సంఘం గడువును ఎంతకాలం పొడిగించింది? 

- Advertisement -

 ‘ఆలస్యం అమృతం విషం’: గడువుకు ముందే ఫారాలు ఇవ్వండి – ఆర్వీ కర్ణన్ : ఓటు అనేది ప్రజాస్వామ్యంలో పరమ పవిత్రమైన ఆయుధం. అలాంటి ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి స్థానిక పోలింగ్ బూత్ స్థాయి అధికారులకు (BLO) వెంటనే అందజేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, అదనపు కమిషనర్ (ఎన్నికలు) బి. సంతోష్‌లతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

“ఇంటింటికీ పంపిణీ చేసిన ఫారాలను పూర్తి చేసి ఇవ్వడంలో ఎవరూ అలసత్వం వహించకూడదు. చివరి నిమిషం వరకు వేచి చూస్తే ఆన్‌లైన్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. గడువులోగా సంతకం చేసిన ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.

హైదరాబాద్‌లో సగం ఓటర్లు ‘గాయాబ్’?: ఆందోళనకర గణాంకాలు : ప్రస్తుత సవరణ ప్రక్రియ ఆధారంగా వెల్లడైన వివరాలు నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉండగా, కేవలం 12,08,935 మంది వివరాలు మాత్రమే బుధవారం నాటికి ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే… అబ్సెంట్, షిఫ్టు, డెత్ (ASD) విభాగంలో ఏకంగా 11,52,613 మంది (24.33 శాతం) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సొంత గ్రామాల్లో ఒక ఓటు, నగరంలో మరో ఓటు కలిగి ఉండడం, శాశ్వతంగా ఇళ్లు మారడం, మరణించడం లేదా బోగస్ ఓట్లు కావడం వల్ల దాదాపు సగం మంది ఓటర్ల నమోదు ప్రక్రియ నగరంలో పెండింగ్‌లో పడిపోయింది.
 నియోజకవర్గాల వారీగా భిన్న చిత్రం: ‘సర్’ ప్రక్రియను సీరియస్ గా తీసుకున్న ఎంఐఎం
నగరంలో ఓటరు సవరణ ప్రక్రియ కొన్ని చోట్ల నల్లేరుపై నడకలా సాగుతుంటే, మరికొన్ని చోట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. ముఖ్యంగా ఎంఐఎం తన పట్టున్న పాతబస్తీ నియోజకవర్గాలలో చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది.

టాప్ స్థానంలో బహదూర్‌పురా: 3,51,023 ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 51,328 మంది తమ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి ముందు వరుసలో నిలిచారు.

జూబ్లీహిల్స్, నాంపల్లి, చంద్రాయణగుట్టలలో ముందంజ: జూబ్లీహిల్స్‌లో 39,186 మంది, నాంపల్లిలో 40,602 మంది, చంద్రాయణగుట్టలో 38,866 మంది, కార్వాన్‌లో 36,928 మంది, మలక్‌పేటలో 30,409 మంది ఓటర్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి.

మిగతా చోట్ల నిస్తేజం: మరోవైపు ముషీరాబాద్ (11,157), సనత్‌నగర్ (9,969), కంటోన్మెంట్ (6,481) వంటి నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు నత్తనడకన సాగుతుండడంతో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఊరటనిచ్చే ‘ఎస్ఐఆర్’ గడువు పొడిగింపు : తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) గడువును భారత ఎన్నికల సంఘం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.

బీఎల్వోల ఇంటింటి సర్వే గడువు: ఆగస్టు 3 వరకు
ముసాయిదా ఓటరు జాబితా విడుదల: ఆగస్టు 10
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ: ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు
తుది జాబితా ప్రచురణ: అక్టోబర్ 12, 2026

అర్హులైన ఏ ఒక్క ఓటరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ గడువు పొడిగించామని, సందేహాలుంటే నియోజకవర్గ హెల్ప్ డెస్కులను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News