HYDRAA Mondikunta: మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. మొండికుంట చెరువు, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై ఆక్రమణల తొలగింపు చేపట్టింది. దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా షాపుల తొలగింపుతో పాటు మెకానిక్ షెడ్లు, ఐరన్ స్టీల్ దుకాణాలు సహా పలు నిర్మాణాలను కూల్చివేశారు.
హైదరాబాద్ మహా నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చెరువుల కబ్జాపై దృష్టి సారించి రూ. వేల కోట్ల విలువైన భూములను కబ్జా కోరల నుంచి కాపాడుతోంది. నేడు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో… హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. మొండికుంటలో ఆక్రమణలను తొలగించి రూ. 2,200 కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల చెర నుంచి రక్షించారు. సర్వే నెంబర్ 53, 54లో ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందనే ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది.
ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించిన హైడ్రా అధికారులు.. మొత్తం 11 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆలయం హద్దుగా చూపించి పలు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐరన్ స్టీల్ షాపులు, ఇంకా పలు రకాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తున్నట్లు తేలింది. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో వాటిని తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ షాపుల ద్వారా నెలకు రూ. లక్షల్లో కబ్జాదారులు అద్దెలు వసూలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది.
భారీ బందోబస్తు మధ్య తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించగా.. ఆ ప్రాంతంలో పార్కులు నిర్మించి చెరువును అభివృద్ధి చేసి సుందరీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

