India’s Biggest Weight Loss Challenge: భారతదేశంలో ప్రజల ఆరోగ్యం కోసం ఒక ముఖ్యమైన చర్యగా, ప్రసిద్ధ వెయిట్ లాస్ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి ఈ రోజు ‘ఇండియాస్ బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు ఊబకాయం (అధిక బరువు) గురించి ఉన్న తప్పుడు అభిప్రాయాలను తొలగించి, ఆరోగ్యంగా మారేందుకు సహాయపడే ఒక శాస్త్రీయ కార్యక్రమం అని చెప్పారు. ప్రొఫెసర్ అడ్రియన్ కెన్నెడీ, డా. నదీమ్ వంటి నిపుణులతో కలిసి డాక్టర్ దుక్కిపాటి “మనసు బలం ఉంటే సరిపోతుంది” అనే పాత ఆలోచనను మార్చి, వైద్య శాస్త్రం, సరైన జీవనశైలి ద్వారా బరువు తగ్గడం సాధ్యమని ప్రజలకు తెలియజేస్తున్నారు.
ఆరోగ్యంపై కొత్త దృక్పథం
హైదరాబాద్ KIMS లివ్లైఫ్ హాస్పిటల్స్లో ఊబకాయం, షుగర్ శస్త్ర చికిత్స విభాగానికి క్లినికల్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ దుక్కిపాటి.. అధిక బరువు టైప్ డయాబెటిస్తో పాటు గుండె జబుులకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యకరమైన భారత్ కోసం రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉందని వెల్లడించారు.
క్లినికల్ అభివృద్ధి: కొత్త పౌష్టికాహార పద్దతులు, సరైన మందులతో చికిత్స
శస్త్ర చికిత్సపై అవగాహన: అవసరమైన సందర్భాల్లో మెటబాలిక్ సర్జరీ కూడా మంచి పరిష్కారమని ప్రజలకు తెలియజేయడం.
సమాజ భాగస్వామ్యం: ప్రజల్లో చైతన్యం పెంచి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం.
స్థిరమైన మార్పు: తాత్కాలిక డైటింగ్ కాకుండా జీవితాంతం పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అభివృద్ధి చేయడం.
ఇండియాస్ బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రాం ద్వారా మనం ఇకపై కేవలం వ్యాధులను నియంత్రించడం మాత్రమే కాదని పూర్తిగా ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నామని డా. నందకిషోర్ దుక్కిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కేవలం బరువు తగ్గించడం గురించి మాత్రమే కాదని.. అనారోగ్యంతో కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడమే లక్ష్యమని వివరించారు. ఈ ఆరోగ్య యాత్రలో ప్రజలు, వైద్యులు, సమాజ నాయకులు అందరూ కలిసి భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

