- తెలంగాణ భవన్ లో వైభవంగా సాగిన అమ్మవారి బోనాల జాతర ఊరేగింపు
- హాజరయిన కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్
చార్మినార్ (తెలుగు ప్రభ): దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో రెండు రోజుల పాటు జరిగే లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ గేట్ నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాలకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొని, ఢిల్లీలో బోనాల ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను కూడా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి చిహ్నంగా నిలుస్తోందన్నారు. 12 సంవత్సరాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో అత్యంత వైభవంగా లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయ కమిటీ ఛైర్మన్ మారుతీ యాదవ్, ఉపాధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎ. వినోద్ కుమార్, కోశాధికారి ఎ. చంద్రకుమార్, మరో కమిటీ ప్రతినిధులు సి. శివకుమార్ యాదవ్, పోసాని సదానంద్ ముదిరాజ్, పోసాని సురేందర్ ముదిరాజ్, నరసింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Festival : భక్తిపారవశ్యం – భక్తుల పరవశం: వైభవంగా శ్రీ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం!


