చార్మినార్ (తెలుగు ప్రభ): లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆరుగురు సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది. బోనాలు, దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా రంగ రమేష్ గౌడ్, ఎ.మాణిక్ ప్రభు గౌడ్, పోసాని విజయ్ కుమార్, సి.హెచ్.వెంకటేష్, బంగ్లా రాజు యాదవ్, కె.రవిరాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం లాల్ దర్వాజా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని, వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది బోనాలు, విజయదశమి ఉత్సవాల వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి గొడవలకు తావివ్వకుండా అందరిని కలుపుకుని ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నహాలు చేస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఆలయ శిఖర పూజతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఆదివారం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని తీసుకు వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. మంగళవారం ఘనంగా దీపోత్సవ కార్యక్రమం జరిగిందని, బుధవారం శాఖంబరి పూజలు, గురువారం సిటీ కళాశాల ఆధ్వర్యంలో బోనాల సమర్పణ, శుక్రవారం శిఖర హారతి, శనివారం తొట్టెల ఊరేగింపు, బలిగంప, ఆదివారం అమ్మవారికి అభిషేక పూజల అనంతరం బోనాల సమర్పణ, సోమవారం పోతరాజు స్వాగతం, రంగం, భవానీ రథయాత్ర, అమ్మవారి ఘటం నిమజ్జనంతో ఉత్సవాలు ముగియనున్నాయన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Also Read: Zonal Commissioner: సర్ విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలి.. జోనల్ కమిషనర్ విజ్ఞప్తి

