చార్మినార్ (తెలుగు ప్రభ): ఆషాఢమాసం పాతనగర బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సప్తమాత్రికలకు సప్త బోనాలులో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు ఎం.మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. బ్యాండు చప్పుళ్ళు, మేళ తాళాలు, పోతరాజుల వీరంగాల నడుమ, శివసత్తుల నడుమ జోగిని అవిక బంగారు బోనమెత్తుకుని హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుంచి అంగరంగ వైభవంగా ఉరేగింపుగా బయలుదేరారు. అంతకుముందు శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి ఉమ్మడి దేవాలయాల ఉరేగింపు కమిటీ మధుసూదన్ యాదవ్ బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిబౌలి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి చేరుకుని అక్కడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉమ్మడి కమిటీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్, మాజీ చైర్మన్ రాఘవేందర్, హన్స్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Patanjali: బీమా రంగంలోకి పతంజలి ఎంట్రీ.. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్తో ఒప్పందం


