గండిపేట్ (తెలుగు ప్రభ): నార్సింగి సర్కిల్ పరిధిలోని నేక్నాంపూర్ బాపు హిల్స్లో సోమవారం కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటన మధ్యాహ్న సమయంలో జరగడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. అయితే, రాత్రి వేళల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రాణాపాయం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపు హిల్స్ ప్రాంతంలో చాలాకాలంగా వీధి దీపాల కొరత నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళల్లో వీధులన్నీ చీకట్లో మునిగి పోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అడవి జంతువులు లేదా విషసర్పాలు సంచరించినా గుర్తించే పరిస్థితి లేదని వాపోతున్నారు. వీధి దీపాల ఏర్పాటు కోసం సంబంధిత అధికారులకు పలుమార్లు వినతులు అందించినప్పటికీ త్వరలో ఏర్పాటు చేస్తాం అనే హామీలకే పరిమితమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొండచిలువ ఘటనతో స్థానికుల్లో భయం మరింత పెరిగిందని, ఇకనైనా అధికారులు స్పందించి బాపుహిల్స్లో తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి రాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Also Read: Bonalu : విగ్రహ ప్రతిష్ఠపై విస్మయం… ఉజ్జయిని మహంకాళి రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి!

