- రోడ్డును మింగేసి.. ఐదు అంతస్తుల భవనం..
- 100 గజాల స్థలంలో ఐదు అంతస్తుల నిర్మాణమంటూ ఆరోపణలు
- రోడ్డు ఆక్రమణ, సెట్బ్యాక్ ఉల్లంఘనలపై స్థానికుల అభ్యంతరం
- టౌన్ప్లానింగ్ ఔట్సోర్సింగ్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు
- ఉన్నతస్థాయి అధికారులు స్పందించి విచారణ చేయాలని స్థానికుల డిమాండ్
గండిపేట్ (తెలుగు ప్రభ): రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్షాకోట్ సాయిరాం నగర్ కాలనీలో ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణం తీవ్ర వివాదానికి కేంద్రబిందువైంది. స్థానికుల ఆరోపణల ప్రకారం సుమారు 100 గజాల స్థలంలో రోడ్డు విస్తీర్ణాన్ని ఆక్రమిస్తూ, సంబంధిత శాఖల అనుమతులు, తప్పనిసరి సెట్బ్యాక్లు లేకుండానే ఐదు అంతస్తుల భవనం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇంత బహిరంగంగా నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కాలనీవాసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టౌన్ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు ఔట్సోర్సింగ్ సిబ్బంది భారీ మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తూ, అక్రమ నిర్మాణాల సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలకు అధికార వ్యవస్థలోని కొందరి నుంచి పరోక్ష సహకారం లభిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై ఉన్నత అధికారులు తక్షణమే దృష్టి సారించి, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనల అమలు, రోడ్డు ఆక్రమణ ఆరోపణలు, అలాగే సంబంధిత సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Also Read: Narsingi PS: రూపారెడ్డిని అరెస్టు చేయాలి.. నార్సింగి పీఎస్లో దళిత సంఘాల ఫిర్యాదు

