సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమం, ఉపాధి, పునరావాసం తదితర అంశాలపై సైనిక్ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు (రిటైర్డ్) బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పన, పునరావాసం, సమన్వయ భద్రతా సేవల నిర్వహణ కోసం “తెలంగాణ ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్” ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని డైరెక్టర్ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ప్రధాన కార్యదర్శి, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ల సంస్థాగత నిర్మాణం, నిర్వహణ విధానం, ఆర్థిక నమూనా, అమలు విధానాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించాల్సిన రాష్ట్ర సైనిక్ బోర్డు సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించాలని బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని త్వరలోనే సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాలు, గృహ భద్రత వంటి సమస్యలతో పాటు, ఇందిరమ్మ హౌసింగ్ పథకంలో మాజీ సైనికులు, వీరనారీమణులు (యుద్ధ వీరుల భార్యలు), అర్హులైన మాజీ సైనిక కుటుం బాలకు నిర్దిష్ట శాతం ఇళ్లను కేటాయించాలని డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Also read: Bonalu festival: బోనాల ఉత్సవాలను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్.. ప్రారంభించిన వి.హనుమంత రావు

