- రూ. 34 లక్షల ఎక్స్గ్రేషియా.. భార్యకు కారుణ్య నియామకం
- ఎస్బీఐ బీమా కింద రూ.1 కోటి మంజూరు
- సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఈ హామీ
రాజేంద్రనగర్ (తెలుగు ప్రభ): విధి నిర్వహణలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ శాఖ ఆర్టిజన్ కుటుంబానికి ప్రభుత్వం, విద్యుత్ శాఖ అండగా నిలిచింది. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ సబ్డివిజన్, చిన్న గోల్కొండకు చెందిన ఆర్టిజన్ ఎం. అనిల్కుమార్ విధి నిర్వహణలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్కు గురై మృతి చెందిన నేపథ్యంలో, ఆయన కుటుంబానికి రూ. 34 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయడంతో పాటు భార్య ఎం. రజితకు కారుణ్య నియామకం కల్పించారు. అదనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీమా పథకం ద్వారా రూ.1 కోటి బీమా ప్రయోజనం కూడా అందేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యుత్ శాఖ అధికారులకు రజిత కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతోనే పరిహారం, ఉద్యోగం, బీమా ప్రయోజనాలు త్వరితగతిన అందాయని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డివిజనల్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి దశలవారీగా పరిష్కరిస్తామని డివిజనల్ ఇంజనీర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్-82 సర్కిల్ డివిజన్ నాయకులతో పాటు ఇతిహాస్ యూనియన్ ప్రతినిధులు విద్యుత్ శాఖ ఉద్యోగులు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Also read: Balkampet : శాకాంబరీ శోభితం.. నేత్రపర్వంగా ఎల్లమ్మతల్లి ఆషాఢ మహోత్సవం

