సికింద్రాబాద్ (తెలుగుప్రభ): మహిళల భద్రత, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో కార్ఖానా పోలీస్స్టేషన్లో ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత, చట్టపరమైన హక్కులు, పోలీసు సేవలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ జి.శంకర్ రాజు మాట్లాడుతూ.. పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు, భద్రతా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా పనిచేస్తూ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, బాధ్య తాయుతంగా రహదారులను వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో కార్ఖాన డివిజన్ తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్స్టే షన్ అదనపు ఇన్స్పెక్టర్ పి.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

