Student Murder: హైదరాబాద్లో గురువారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ ఇందిరా నగర్లో ఇంజినీరింగ్ విద్యార్థిని కొందరు దుండగులు హత్య చేశారు. మృతుడు జవహర్ నగర్కు చెందిన యావన్(25)గా పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
యావన్ గత నాలుగేళ్లుగా ఇందిరా నగర్కు చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కలిసేందుకు గురువారం రాత్రి ఇందిరా నగర్కు రాగా, యువతి బంధువులు అతడిని పట్టుకుని నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గతంలోనే యువతి బంధువులు యావన్ను హెచ్చరించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల ఇళ్లపై బాధిత బంధువులు దాడికి యత్నించడంతో నామలగుండు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసులను మోహరించారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

