Jeevan Reddy to Join BRS: గత కొంతకాలంగా సొంత పార్టీలో అసహనానికి గురై ఇటీవల రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. మరో 10 రోజుల్లో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు స్థలం, తేదీని ఆయన అధికారికంగా ప్రకటించారు.
కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఆరోజు జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతుండగా.. ఆయన సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ ప్రకటనకు ముందుగా జీవన్ రెడ్డి- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుసుకున్నారు. కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ను సైతం ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లో జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఆ కాసేపటికి పార్టీలో చేరే తేదీ, వివరాలను జీవన్ రెడ్డి వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/national-news/boat-capsizes-in-yamuna-river-10-people-dead/
గత 42 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగిన జీవన్ రెడ్డి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. కాగా, గత కొంతకాలంగా పార్టీలో ఫిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇస్తూ, సీనియర్లను, విధేయులను విస్మరిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ ప్రెసిడెంట్, పలువురు మంత్రులు బుజ్జగింపు ప్రయత్నాలు చేసినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేసి ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

