Karimnagar Municipal Corporation: తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంది. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పదవిని కమలం సొంతం చేసుకోగా.. ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా అదే పార్టీకి చెందిన సునీల్ రావును ఎన్నుకున్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/curry-leaves-price-rises-to-rs-100-per-kg/
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో కొన్ని రోజులుగా తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఒకానొక సమయంలో రాజకీయ సమీకరణాలు మారిపోయి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ సాగింది. ఎట్టకేలకు ఉత్కంఠ వీడి.. కరీంనగర్ మేయర్ పదవిని కమలదళం సొంతం చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరుతో కాషాయ జెండా ఎగరనుంది.
ఈ మేరకు కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ వివరాలను ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా, అధికార కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు పలకగా.. ఆ పార్టీ పదవిని కైవసం చేసుకోలేకపోయింది. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా.. బీజేపీ 30 స్థానాలు గెలుచుకుంది. మరో నలుగురు కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పదవిని సొంతం చేసుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-to-provide-free-cervical-cancer-vaccine-for-girls/
కరీంనగర్ మేయర్ పదవిని దక్కించుకోవడంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టాలని హితవు పలికారు. కరీంనగర్ అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. బీజేపీ మేయర్ ఉన్నాడని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

