Bandi Sanjay Honey Bees Attack: కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద’ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో దాదాపు ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోనరావుపేట – వెదిర గ్రామ పరిసరాల్లో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్ర దృశ్యాలను చిత్రీకరించడానికి వినియోగిస్తున్న డ్రోన్ కెమెరా గాలిలో వెళ్తున్న సమయంలో సమీపంలోని ఒక చెట్టుపై ఉన్న తేనెపట్టును తాకింది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా యాత్రలో పాల్గొన్న వారిపై దాడి చేశాయి.
ఈ దాడిలో బీజేపీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు వేణు ప్రసాద్, సాయి సహా మరో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బండి సంజయ్కు కూడా వైద్యులు సాధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు. గాయపడిన కార్యకర్తలకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ అంతరాయం తర్వాత యాత్ర తిరిగి కొనసాగింది. ఈ రోజు సాయంత్రానికి కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుంది. మొత్తం 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.

