Karimnagar Corporation: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ బలం.. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి చేరుకుంది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ను దాదాపు బీజేపీ కైవసం చేసుకుంది.
శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 66 డివిజన్లకు గాను కమలం 30 డివిజన్లు గెలుచుకోగా.. అధికార కాంగ్రెస్ కేవలం 14 డివిజన్లే గెలుచుకుని తడబడింది. ఇక బీఆర్ఎస్ 9 సీట్లకే పరిమితమైంది. కాగా, ఇండిపెండెట్లు 8, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 డివిజన్లలో గెలుపొందాయి. దీంతో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ(34) రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
ఈ క్రమంలో స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావించిన బీజేపీ.. ఎట్టకేలకు కరీంనగర్ మేయర్ పదవిని కైవసం చేసుకోబోతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలో చేరారు. ఇక, బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీ బలం 35కి చేరింది. దీంతో కరీంనగర్ బల్దియాపై కాషాయం జెండా ఎగురవేసేందుకు లైన్ క్లియర్ అయింది.

