Karimnagar Robbery Case: కరీంనగర్లో కలకలం రేపిన నగల దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కరీంనగర్ సీపీ గౌష్ అలం మీడియా సమావేశంలో వెల్లడించారు. పక్కా స్కెచ్తో ఈ భారీ దోపిడీ జరిగినట్లు విచారణలో తేలిందన సీపీ గౌష్ తెలిపారు.
పక్కా ప్లాన్తో రెక్కీ: అంతర్రాష్ట్ర ముఠా పక్కా ప్లాన్తో రెక్కీ నిర్వహించి.. ఈ దోపిడి జరిపినట్లుగా సీపీ తెలిపారు. నగల దుకాణం నుంచి పెద్ద మొత్తంలో సొత్తును దోచుకెళ్లినట్లు వెల్లడించారు. మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దోపిడీ వెనుక ముఠా సభ్యులు రెండు నెలల క్రితమే పక్కా వ్యూహం రచించినట్లు విచారణలో తేలిందని అన్నారు. దోపిడీకి పాల్పడటానికి ముందు వీరంతా ధర్మపురిలో ఆశ్రయం పొందారని తెలిపారు. నిందితులు రెండు నెలల క్రితమే నాలుగు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. చివరకు కరీంనగర్ను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. చోరీ అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండేందుకు 3 బృందాలుగా విడిపోయారు. ధర్మపురి వద్ద తాము తెచ్చుకున్న వాహనాలను వదిలేసి.. రైళ్లు, బస్సుల ద్వారా వేర్వేరు ప్రాంతాలకు తప్పించుకునే ప్రయత్నం చేశారని కరీంనగర్ సీపీ గౌష్ అలం తెలిపారు.
ప్రధాన సూత్రధారి సుబోధ్సింగ్: ఈ భారీ దోపిడీలో మొత్తం 13 మంది నిందితులు పాల్గొన్నారని తెలిపారు. బిహార్కు చెందిన సుబోధ్సింగ్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని సీపీ గౌష్ అలం పేర్కొన్నారు. ఈ ముఠా గతంలో బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిందని అన్నారు. ఈ ముఠా తెలంగాణలో దోపిడీ జరగడం ఇదే మొదటిసారని ఆయన వెల్లడించారు.
Also read-Kukatpally: మహిళా కానిస్టేబుల్పై ఎస్సై లైంగిక దాడి.. నిలదీస్తే ఎదురుదాడి!
మిగిలిన నిందితుల కోసం ముమ్మర గాలింపు: ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో నిందితులతో పాటు వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన ఒక వ్యాపారి సైతం ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి ఇప్పటివరకు రూ. 51 వేల నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు సీపీ గౌష్ అలం స్పష్టం చేశారు.

